రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్పై రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కేటాయింపుల రూపంలో ప్రకటించిన నిధులు ఏం సరిపోతాయని ఆగ్రహం వ్యవక్తం చేస్తున్నారు. ఎన్నో ఆశలు చూపించి, ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పుడు అరకొర నిధుల కేటాయింపులతో రైతులకు ఏం న్యాయం జరుగుతుందని వారు ప్రశ్నిస్తున్నారు.
వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పలు కేటాయింపులు ప్రకటించినప్పటికీ అవి రైతుల అవసరాలకు సరిపోతాయా అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. అన్నదాత సుఖీభవ పథకానికి రూ.6,600 కోట్లు కేటాయించినట్లు బడ్జెట్లో చూపించారు. అయితే రాష్ట్రంలోని రైతుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే ఈ మొత్తం సరిపోదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైతులందరికీ సాయం అందేలా స్పష్టమైన ప్రణాళిక కనిపించకపోవడం ఆందోళనకు కారణమవుతోంది.
ధరల స్థిరీకరణ నిధికి రూ.300 కోట్లు మాత్రమే కేటాయించడం కూడా చర్చనీయాంశమైంది. మార్కెట్లో ధరలు పడిపోయినప్పుడు రైతులను ఆదుకోవాల్సిన ఈ నిధి అరకొర నిధులు కేటాయించడం ఏంటి అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో గత ప్రభుత్వం కేటాయించిన మొత్తాలను గుర్తు చేస్తూ ఇప్పుడు కేటాయింపులపై బాధపడుతున్నారు.
పంటల బీమా, ప్రకృతి విపత్తుల సమయంలో సాయం వంటి అంశాలకు కేవలం రూ.250 కోట్లు మాత్రమే కేటాయించినట్లు బడ్జెట్లో పేర్కొనడం నిజంగా బాధాకరం. వరదలు, కరువు, తుఫాన్లు వంటి విపత్తులు తరచూ ఎదురవుతున్న పరిస్థితుల్లో ఈ మొత్తం ఏం సరిపోతుందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా వడ్డీ లేని రుణాల కోసం కూడా కేవలం రూ.250 కోట్లు మాత్రమే కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇన్పుట్ సబ్సిడీ కోసం కేవలం రూ.310 కోట్లు కేటాయిస్తే ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో అవేమి సరిపోతాయని అంటున్నారు. యూరియా సరఫరా సమస్యలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎరువుల నిర్వహణపై కూడా స్పష్టత అవసరమని వారు అడుగుతున్నారు.
మొత్తంగా చూస్తే అరకొర కేటాయింపులు ప్రకటించినప్పటికీ, వాటి అమలు ఎంత వరకు జరుగుతుందనే అనుమాత్రం రైతులను వెంటాడుతూనే ఉంది.






