సీబీఎస్ఈ (CBSE) పదో తరగతి బోర్డు పరీక్షలు ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానంలో రెండు విడతలుగా నిర్వహించబడుతున్నాయి. రెండో విడతలో మాత్రమే పరీక్షలు రాయాలని కొంతమంది విద్యార్థులు చేసిన వినతిని బోర్డు తిరస్కరించి, తొలి విడతకు హాజరు కావడం ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అని స్పష్టం చేసింది.
మొదటి విడతలో మూడు లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులకు గైర్హాజరైన విద్యార్థులకు మే నెలలో జరిగే రెండో విడత పరీక్షలు రాయడానికి అవకాశం ఉండదు. అలాంటి వారిని ‘ఎసెన్షియల్ రిపీట్’ కేటగిరీలో చేర్చి, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే పరీక్షలకు మాత్రమే అనుమతిస్తారు.
ఒకటి లేదా రెండు సబ్జెక్టుల్లో మాత్రమే ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ‘కంపార్ట్మెంట్’ కేటగిరీ కింద పరిగణించి, రెండో విడతలో తిరిగి పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తారు. అలాగే ఇప్పటికే ఉత్తీర్ణులైన వారు తమ మార్కులను పెంచుకోవాలనుకుంటే గరిష్టంగా మూడు సబ్జెక్టుల్లో మళ్లీ పరీక్షలు రాయవచ్చు.
నూతన జాతీయ విద్యా విధానం (NEP) సూచనల మేరకు విద్యార్థులపై బోర్డు పరీక్షల ఒత్తిడిని తగ్గించే ఉద్దేశంతో ఈ ద్వి-విడత విధానాన్ని అమలు చేస్తున్నారు. ఫిబ్రవరిలో జరిగే పరీక్షలను తప్పనిసరి చేయగా, మే నెలలో జరిగేవి ఐచ్చికంగా ఉంచారు. రెండు విడతలూ పూర్తి సిలబస్ ఆధారంగానే జరుగుతాయి.
ఈ క్రమంలో తొలి విడత పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమై మార్చి 10 వరకు కొనసాగనున్నాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుకుని నిబంధనలు పాటించాలని సీబీఎస్ఈ సూచించింది.






