వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. టీటీడీకి నెయ్యి సరఫరా వ్యవహారం, ఇందాపూర్ డెయిరీ, హెరిటేజ్ సంస్థల పాత్ర, గత ప్రభుత్వ కాలంలో జరిగిన పరిణామాలన్నింటినీ సవిరంగా వివరించారు.
జగన్ చెప్పిన దాని ప్రకారం ఇందాపూర్ డెయిరీ టీటీడీ నెయ్యి సరఫరా వ్యవహారాల్లోకి ప్రవేశించిన సమయం, అర్హతలు కోల్పోయిన తర్వాత మళ్లీ పొందిన అవకాశాలు, టెండర్ ప్రక్రియలో జరిగిన మార్పులు అన్నీ కూడా చంద్రబాబు హయాంలో జరిగినవే అని చాలా స్పష్టంగా చెప్పారు. ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా ఒకసారి డిస్క్వాలిఫై అయిన ఇందాపూర్ డెయిరీ సంస్థ మళ్లీ అర్హత పొందడం ఎలా జరిగిందన్న ప్రశ్నను కూడా ఆయన లేవనెత్తారు. అలాగే గతంలో కిలో నెయ్యి ధర తక్కువగా ఉండగా, తరువాత అది భారీగా పెరిగిందని పేర్కొంటూ ధరల మార్పుపై కూడా సందేహాలు వ్యక్తం చేశారు.
హెరిటేజ్ సంస్థతో ఇందాపూర్ డెయిరీకి ఉన్న సంబంధాలపై కూడా ఆయన దృష్టి సారించారు. ఒక దశలో మ్యానిఫ్యాక్చరింగ్ భాగస్వామ్యంగా చూపించబడిన వివరాలు తరువాత మారాయని, సంబంధిత సమాచారం వెబ్సైట్లో సవరించబడిందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామాలు బయటపడిన తర్వాత సంస్థలో కీలక పదవుల్లో మార్పులు చోటుచేసుకున్నాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
ఇంకా ఒక కీలక అంశంగా, భోలే బాబా పేరుతో ప్రసిద్ధి చెందిన సంస్థ అసలు గుర్తింపు, దానికి ఇచ్చిన టెక్నికల్ అర్హతలు, ట్యాంకర్ల సరఫరా మరియు రిజెక్షన్ వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. కొన్ని ట్యాంకర్లు తిరస్కరించబడ్డప్పటికీ అవి ఎలా ఉపయోగించబడ్డాయన్నది దర్యాప్తు సంస్థల నివేదికల్లో ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో జరిగిన ప్రతి దశను కాలక్రమంలో పరిశీలిస్తే బాధ్యత ఎవరిది అన్నది స్పష్టమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
మొత్తానికి, టీటీడీ నెయ్యి సరఫరా వివాదం, చంద్రబాబు కావాలనే చేస్తున్నారని, అన్నీ కూడా బాబు హయాంలో జరిగితే వైయస్ఆర్ సీపీకి ఏం సంబంధం అని కూడా ఆయన ప్రశ్నించారు. మొత్తానికి వైయస్ జగన్ అడిగిన ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు, హెరిటేజ్ సంస్థ యాజమాన్యం ఇరకాటంలో పడిందనే చెప్పాలి.






