తాము అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3000లు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల ముందు ప్రతి సభలోనూ చంద్రబాబు నాయుడు, లోకేష్ చెబుతూ వచ్చారు. కూటమిలో భాగస్వామి అయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అందుకు వత్తాసు కూడా పలికారు. నాది కూడా హామీ అంటూ చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు పూర్తి కావస్తోంది. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం 3 బడ్జెట్లను ప్రవేశపెట్టింది. ఇక మిగిలి ఉండేది రెండు. ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి అతీగతీ లేదు.
నెలకు రూ.3 వేల చొప్పున ప్రతి నిరుద్యోగ యువకుడికి ఇవ్వాలని ప్రకటించిన ఈ పథకం ప్రకారం ఏడాదికి ఒక్కొక్కరికి రూ.36 వేలు అందాల్సి ఉంది. రెండేళ్లకు గాను ఒక్కొక్కరికి రూ.72వేలు చొప్పున 20 లక్షల మందికి ఈ ప్రభుత్వం బాకీ పడింది. మూడో బడ్జెట్లో అయినా అమలు దిశగా అడుగు పడుతుందా అన్న ఆశతో ఎదురుచూసిన యువతకు, అక్కడ కూడా సున్నా కేటాయింపే ఎదురవడం తీవ్ర నిరాశ కలిగించింది.
ఇలా నిరుద్యోగ యువతను మోసం చేయడం చంద్రబాబు నాయుడికి ఇది మొదటి సారి కాదు. 1999, 2014, 2024లోనూ ఇలాగే జరిగింది. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రకటించడం. గద్దెనెక్కగానే నిరుద్యోగ యువతకు వెన్నుపోటు పొడవడం మామూలు అయిపోయింది.
మొత్తానికి, నిరుద్యోగ యువతకు భరోసా ఇస్తానన్న హామీ అమలు కాకపోవడం, బడ్జెట్లో కనీస ప్రస్తావన కూడా లేకపోవడం వల్ల యువతలో తీవ్ర నిరాశ, అసంతృప్తి నెలకొంది. భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్న వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం నాయకత్వంపై నమ్మకాన్ని దెబ్బతీస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.






