ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల దశాబ్దాల నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారంగా భావించిన వెలిగొండ (నల్లమల సొరంగం) ప్రాజెక్టు మళ్లీ రాజకీయ వాదోపవాదాల కేంద్రంగా మారింది. ప్రాజెక్టు పనులు, రైతులకు న్యాయం, ప్రకాశం జిల్లా అభివృద్ధి అంశాలపై అధికార, ప్రతిపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వెలిగొండ ప్రాజెక్టుకు ఎవరు ఏమి చేశారు అన్నది ఒకసారి చూద్దాం.
జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా దివంగత వైయస్ఆర్ వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అంతేకాదు సొరంగాల తవ్వకాన్ని ప్రారంభించారు. దీంతో ఎన్నో ఏళ్లుగా కాగితాలకే పరిమితమైన ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోకి వచ్చింది. ఆయన మరణానంతరం ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ ప్రాజెక్టును పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవనే చెప్పాలి.
2019లో అధికారంలోకి వచ్చిన వైయస్ జగన్ తన తండ్రి వైయస్ఆర్ ప్రారంభించిన వెలిగొండ ప్రాజెక్టును మళ్లీ పట్టాలు ఎక్కించారు. తన ఐదేళ్ల కాలంలో (రెండేళ్లు కరోనా) రెండు ప్రధాన సొరంగాల నిర్మాణాలను పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టును జాతికి అంకితం కూడా చేశారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో తన పాత్ర పెద్దగా లేదనే చెప్పాలి. తన హయాంలో పునరావాసం (R&R) నిధుల విడుదల ఆలస్యం, భూసేకరణ సమస్యలు ప్రధాన విమర్శలుగా ఉన్నాయి. నిధులు విడుదల చేశామని బాబు సర్కార్ చెబుతున్నప్పటికీ భూస్వాములు, నిర్వాసితులు మాత్రం ఇంకా చెల్లింపులు పూర్తికాలేదని అంటున్నారు.






