ఏపీ శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. కల్తీ నెయ్యి అంశంపై జరిగిన చర్చలో మాట్లాడిన అచ్చెన్నాయుడు, వైయస్ జగన్తో పాటు మండలి చైర్మన్ మోషేన్రాజును క్రిస్టియన్లుగా పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా చేసిన ఈ వ్యాఖ్యలు సభలో తీవ్ర అభ్యంతరాలకు కారణమయ్యాయి.
షాక్కు గురైన మండలి చైర్మన్
అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై మండలి చైర్మన్ మోషేన్రాజు తీవ్రంగా స్పందించారు. తనను క్రిస్టియన్గా ఎలా అభివర్ణిస్తారని ప్రశ్నిస్తూ సభలోనే మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. వ్యక్తిగతంగా తనను కించపరిచేలా మాట్లాడారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వైయస్ఆర్సీపీ సభ్యుల ఆగ్రహం
మంత్రి వ్యాఖ్యలపై వైయస్ఆర్సీపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సభలో నినాదాలు చేస్తూ అచ్చెన్నాయుడు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మండలిలో కొంతసేపు తీవ్ర గందరగోళం నెలకొంది.
చర్చల తర్వాత క్షమాపణ
ఈ వివాదం మరింత ముదరకుండా ఉండేందుకు పలువురు మంత్రులు అచ్చెన్నాయుడితో చర్చలు జరిపినట్లు సమాచారం. అనంతరం స్పందించిన అచ్చెన్నాయుడు, తాను చేసిన వ్యాఖ్యలు తప్పుగా ఉంటే వెనక్కి తీసుకుంటానని తెలిపారు. మండలి చైర్మన్ హిందువని సభలోనే స్పష్టత వచ్చిన నేపథ్యంలో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ క్షమాపణ కోరారు.
క్షమాపణను స్వీకరించిన ఛైర్మన్
మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పిన తర్వాత మండలి చైర్మన్ దాన్ని స్వాగతించారు. దీంతో వైయస్ఆర్సీపీ సభ్యులు తమ నిరసనను నిలిపివేయాలని ఛైర్మన్ సూచించారు.
అయితే ఒక మంత్రి సభలో మాట్లాడేటప్పుడు వ్యక్తిగత విశ్వాసాలు, మతం వంటి అంశాలను ఆధారాలు లేకుండా ప్రస్తావించడం సరైందా? అయితే మంత్రి అచ్చెన్నాయుడు ప్లాన్ లో భాగంగానే అలా మాట్లాడారా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా ప్రజాస్వామ్య వేదిక అయిన శాసనసభలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడి లక్షణం అయితే కాదు.






