సాయంత్రం 6 గంటలకు డాక్యుమెంట్లతో నిజాలు బయటపెడతామన్న వైయస్ఆర్సీపీ
తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మాటలతో, చర్యలతో దెబ్బతీస్తున్నారని వైయస్ఆర్సీపీ ఆరోపించింది. తిరుమలను అభివృద్ధి చేయడంలో, హిందూ భక్తుల మనోభావాలను కాపాడడంలో నాటి వైయస్ రాజశేఖర్ రెడ్డి నుంచి నేటి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాల వరకు తీసుకున్న చర్యలను పూసగుచ్చినట్లు వివరించేందుకు సిద్ధమయ్యామని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
తిరుమల అంశంపై జరుగుతున్న ప్రచారాల నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు పూర్తి డాక్యుమెంట్లతో ప్రజల ముందుకు వస్తామనివైయస్ఆర్సీపీ ప్రకటించింది. “ఓం నమో వెంకటేశాయ” అనే పేరుతో తిరుమలపై వాస్తవాలను వెల్లడించే డాక్యుమెంటరీని విడుదల చేస్తామని పార్టీ నేతలు పేర్కొన్నారు.
తిరుమలను రాజకీయాలకు వేదికగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నవారికి నిజాలను ప్రజల ముందుంచడం ద్వారా సమాధానం ఇస్తామని వైయస్ఆర్సీపీ పేర్కొంది. తిరుమల పవిత్రత, విశిష్టతను కాపాడేందుకు తమ ప్రభుత్వాలు తీసుకున్న చర్యలను కూడా ప్రజలకు వివరిస్తామని తెలిపింది. ఎవరు తిరుమలపై రాజకీయాలు చేశారో, ఎవరు దాని పవిత్రతను కాపాడారో ఆధారాలతో చూపిస్తామని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా వైయస్ఆర్సీపీ నేతలు 2007 జూన్ 2న నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చిన జీఓ నంబర్ 746 ద్వారా తిరుమల పరిధిని 322.68 చదరపు కిలోమీటర్లకు విస్తరించారని తెలిపారు. ఈ నిర్ణయంతో ఏడు కొండలను పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి చేర్చారని వివరించారు.






