ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ఏకంగా ఆరుగురు మంత్రులు గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ గైర్హాజరు చుట్టూ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరు కాలేదు. అలాగే అనారోగ్య కారణాలతో హోం మంత్రి అనిత, టీజీ భరత్, గొట్టిపాటి రవి గైర్హాజరు అయ్యారని సమాచారం. మరో మంత్రి ఫరూక్ కుటుంబ కార్యక్రమం కారణంగా హాజరు కాలేదని చెబుతున్నారు. నిజంగా కారణాలు అదేనా.. ఇంకేమైనా ఉన్నాయా అన్నది రాయకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
అయితే ఇదే సమయంలో రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సదస్సుకూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. రాష్ట్రానికి కీలకమైన నిర్ణయాలు తీసుకునే కేబినెట్ సమావేశానికి ఆరుగురు మంత్రులు ఒకేసారి గైర్హాజరు కావడం యాదృచ్ఛికమేనా? ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై మంత్రుల్లోనే అసంతృప్తి ఉందా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
కూటమి పార్టీల మధ్య అంతర్గత విభేదాలే దీనికి కారణమా? లేక ఇప్పుడు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో రాజకీయంగా సమస్యలు సృష్టిస్తాయనే భయమా? అనే కోణంలోకూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు.
రాష్ట్రంలో ఇటీవల తీసుకుంటున్న కొన్ని కీలక నిర్ణయాలపై అధికార కూటమి లోపలే భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేబినెట్ సమావేశానికి మంత్రులు గైర్హాజరు కావడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నిర్ణయాలు తీసుకునే కేబినెట్ సమావేశానికి మంత్రులు గైర్హాజరు కావడం మంచిది కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు సంబంధం ఉన్న అంశాలపై చర్చించే వేదికలో అందరూ పాల్గొనడం అవసరమని మాట్లాడడం గమనార్హం.






