రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి సంక్షేమ హాస్టళ్ల నిర్వహన దారుణంగా తయారైంది. అక్కడి పరిస్థితులు ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 19 నెలల కాలంలో నాసిరకం ఆహారం, అపరిశుభ్రత, సరైన సదుపాయాలు లేకపోవడం వివిధ కారణాల కారణంగా దాదాపు 900 మందికి పైగా హాస్టళ్లలోని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
నాసిరకం భోజనం… దుర్భర జీవనం
సంక్షేమ హాస్టళ్లు పేద మరియు వెనుకబడిన వర్గాల పిల్లలకు భరోసాగా ఉండాల్సిన సంక్షేమ హాస్టళ్లు.. అందుకు విరుద్ధంగా తయారయ్యాయి. పలుచోట్ల పాడైపోయిన ఆహారం, పురుగులు పడిన అన్నం, తాగునీటి సమస్యలు బయటపడుతున్నాయి. సరైన పోషకాహారం అందకపోవడంతో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసమర్థ పాలనకు నిదర్శనం
ఈ ఘటనలు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అద్దం పడుతున్నాయని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యంగా సంక్షేమ శాఖ పర్యవేక్షణలో లోపాలు, బాధ్యులపై చర్యల లేకపోవడం పరిస్థితిని మరింత విషమం చేసిందని అంటున్నారు. విద్యార్థుల ఆరోగ్యం కంటే ప్రచార కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
పేద విద్యార్థుల ప్రాణాలంటే అంత చులకనా?
ప్రభుత్వం అంతర్జాతీయ ప్రముఖులను రాష్ట్రానికి ఆహ్వానిస్తూ భారీ స్థాయిలో ఖర్చు పెడుతోందని కానీ, రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులను పట్టించుకోవడం లేదని పలువురు విమర్శలు చేస్తున్నారు. తాజాగా బిల్గేట్స్ ను ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్రానికి ఆహ్వానించి భారీ స్థాయిలో ప్రచారం చేశారు. ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అయితే ఇవే డబ్బులు సంక్షేమ హాస్టళ్ల కోసం ఖర్చు పెట్టి ఉంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కాదని విద్యార్థలు తల్లిదండ్రులు అంటున్నారు.
వెనుకబడిన వర్గాలపై చిన్నచూపా?
ఈ హాస్టళ్లలో చదివే విద్యార్థులలో ఎక్కువ మంది వెనుకబడిన కులాలకు చెందినవారే. వారి సమస్యలను పట్టించుకోకపోవడం సామాజిక న్యాయంపై ప్రభుత్వ నిబద్ధతపై సందేహాలు రేకెత్తిస్తోంది. విద్య ద్వారా ఎదగాలనుకునే పిల్లల భవిష్యత్తు ఇలా ప్రమాదంలో పడటం బాధాకరమని విద్యావేత్తలు అంటున్నారు. అంతేకాదు విద్యార్థుల ఆరోగ్యం, భద్రత వంటి ప్రాథమిక అంశాలను విస్మరించి ప్రభుత్వం ఇతర కార్యక్రమాల్లో మునిగిపోయిందనే భావన ప్రజల్లో రోజు రోజుకు పెరుగుతోంది.






