ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విజయనగరం జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చీపురుపల్లి నియోజకవర్గంలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 9:30 గంటలకు అమరావతి నుంచి బయలుదేరిన సీఎం, ఉదయం 11:10 గంటలకు చీపురుపల్లి మండలం రావివలస గ్రామానికి చేరుకుంటారు. అక్కడ 11:30 గంటలకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో జరిగే HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలిస్తారు. గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ నివారణ కోసం 14 ఏళ్లు పైబడిన బాలికలకు ఉచితంగా ఇస్తున్న ఈ టీకా కార్యక్రమంలో పాల్గొని, వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చిన బాలికలతో సీఎం ముఖాముఖి నిర్వహించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.45 లక్షల బాలికలకు ఈ టీకాలు అందించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజస్థాన్లోని అజ్మీర్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ స్థాయి HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా, అదే కార్యక్రమంలో రావివలస నుంచి సీఎం చంద్రబాబు వర్చువల్గా పాల్గొంటారు. అనంతరం రాష్ట్రంలో అమలు చేయనున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు.
తదుపరి మధ్యాహ్నం 1 గంటకు జరిగే ప్రజావేదిక సభలో సీఎం ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2:50 గంటలకు రావివలసలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తారు. తర్వాత 3:15 గంటలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. జిల్లా పర్యటన పూర్తయ్యాక సాయంత్రం తిరిగి అమరావతి బయలుదేరి, రాత్రి 7 గంటలకు చేరుకుంటారు.






