బిగ్బాస్ ఫేమ్ దివ్వెల మాధురి మరోసారి వివాదంలో నిలిచింది. పవిత్రమైన తిరుమల కొండపై ఆమె నిర్వహించిన బర్త్డే వేడుకలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విజిలెన్స్ అధికారులు కూడా విచారణ ప్రారంభించినట్లు సమాచారం.
తిరుమలలోని ఓ గెస్ట్ హౌస్లో మాధురి తన స్నేహితురాలు, బిగ్బాస్ విన్నర్ తనూజ పుట్టినరోజును ఘనంగా జరిపినట్లు తెలుస్తోంది. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకోవడంతో విషయం బయటకు వచ్చింది.
అయితే తిరుమల కొండపైకి కేక్లు తీసుకెళ్లడం నిషేధం అనే నిబంధన ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ కేక్ను ఎలా తీసుకెళ్లారన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఈ అంశంపై టీటీడీ విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
వేడుకలకు ముందు మాధురి, తనూజలు తిరుమల శ్రీవారి ఆలయాన్ని కూడా దర్శించుకున్నట్లు సమాచారం. బర్త్డే సందర్భంగా మాధురి తనూజకు చీర, గాజులు, బంగారు కమ్మలు వంటి బహుమతులు అందించినట్లు వీడియోల్లో కనిపిస్తోంది.
ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా తిరుమలలో మాడ వీధుల్లో సోషల్ మీడియా రీల్స్, వీడియోలు చిత్రీకరించి వాటిని నెట్టింట షేర్ చేయడంతో దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో చిక్కుకున్నారు. ఆ ఘటనపై మాధురిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
ఇప్పుడీ తాజా ఘటనతో తిరుమలలోని నిబంధనల అమలుపై మరోసారి చర్చ మొదలైంది.






