తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కల్తీ ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అసెంబ్లీలో జరిగిన తాజా చర్చ ఈ వివాదాన్ని మరింత వేడెక్కించింది. అధికార పక్షం, ప్రతిపక్షం పరస్పరం ఆరోపణలు చేసుకుంటుండగా, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
అసెంబ్లీలో ఆరోపణల తూటాలు
అసెంబ్లీలో ఎన్డీయే సభ్యులు ఎక్కువగా వైయస్ జగన్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పూర్వ బోర్డు నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. అయితే పవన్ కళ్యాణ్ స్వరం మాత్రం మారింది. కల్తీ వెనుక నేరుగా గత ప్రభుత్వ అధినేత ఉన్నారని తాను ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు.
ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశంలో నెయ్యిలో జంతు సంబంధ పదార్థాలు కలిశాయని తెలిసి తీవ్రంగా బాధపడ్డానని, ఆ భావోద్వేగంతోనే పశ్చాత్తాప దీక్ష చేపట్టానని, హిందువుల విశ్వాస రక్షణ కోసం “సనాతన బోర్డు” ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశానన్నారు.
అయితే పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యల్లో ఒక మార్పు స్పష్టంగా కనిపించింది. నేరుగా ఎవ్వరినీ దోషిగా పేర్కొనకుండా, “దోషులు ఎవరైనా శిక్షించాలి” అనే సాధారణ స్థాయిలోనే నిలిచారు. ఇదే విషయంపై సొంత పార్టీలోనూ, కూటమిలోనూ ఒకటే చర్చ నడుస్తోంది.






